బెజవాడలో మహాధర్నా ఉద్రిక్తం: టిడిపి నేతల అరెస్టు

తెలుగుదేశం తలపెట్టిన మహాధర్నాకు సిపిఐ కూడా మద్దతు ఇస్తోంది. పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అడ్డుకుంటుండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులను పోలీసులు మధ్యలోనే ఉడ్డుకుంటున్నారు.
విజయవాడలో ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రోడ్లను దిగ్బంధం చేశారు. దీంతో విజయవాడ ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మహాధర్నాకు పాదయాత్ర చేపట్టిన నాయకులను పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుకున్నారు.
నాలుగు జిల్లాల తెలుగుదేశం పార్టీ నేతలు, సిబిఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రకాశం బ్యారేజీ దిగువన తలపెట్టిన ధర్నాకు వేలాదిగా కార్యకర్తలను తరలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ధర్నాకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆందోళనకు దిగింది.
పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం నీరు విడుదల చేయడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దె రామ్మోహన్ రావు విమర్శించారు. రైతు ఉద్యమాలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తెలుగుదేశం తన ధర్నాను విరమించి నీరు విడుదల చేస్తామంటూ దూసుకెళ్లే ప్రయత్నాలు చేసింది. పార్టీ నాయకులు కార్యకర్తలను, నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications