నాపై రాజకీయ కుట్ర: గీతిక ఆత్మహత్య కేసుపై కందా
కందా పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆయన 11 రోజుల పాటు పరారీలో ఉన్నారు. గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్లో ఆమె కందాపై, ఆయన ఉద్యోగిని అరుణా చద్ధాపై ఆరోపణలు చేసింది.
తనపై వచ్చిన ఆరోపణలను కందా ఖండించారని, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 45 రోజులు ఆమెను తాను కలుసుకోలేదని కందా చెప్పినట్లు పోలీసులు అన్నారు. అరుణా చద్దానే గీతిక తల్లిదండ్రులను పిలిచి, ఉద్యోగంలో గీతికను చేర్పించాలని అడిగినట్లు కందా చెప్పారు .
కందాను పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్న అంకితా సింగ్ను కూడా ప్రశ్నించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం సింగపూర్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంకితకు, గీతికకు మధ్య గొడవ జరిగినట్లు, ఆ గోడవ కారణంగా అంకితపై గీతిక కేసు పెట్టినట్లు పోలీసులు కనిపెట్టారు. అప్పట్లో దీనిపై పానాజీ పోలీసులు అంకితను ప్రశ్నించినట్లు కూడా చెబుతున్నారు.