ముఖ్యమంత్రి ఫైర్: భగ్గుమన్న టిడిపి ఎమ్మెల్యేలు

విద్యుత్తుపై కాకి లెక్కలు చెబుతున్నారని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రితో అన్నారు. దాంతో ఇరువురికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఏం మాట్లాడుతున్నారంటూ ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మీరు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కలిసి నాటకాలాడుతున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో తెలుగుదేశం నాయకులు సంతృప్తి చెందలేదు.
విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తెలుగుదేశం శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సచివాలయంలోని సి బ్లాకులో బైఠాయించారు. వారు అలా బైఠాయించిన సమయంలోనే ముఖ్యమంత్రి బయటకు వెళ్లిపోయారు. అయితే, మళ్లీ తిరిగి వచ్చి తెలుగుదేశం శాసనసభ్యులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం సభ్యులు ఆయనను కోరారు. అయితే, ఆ మీరే చెప్పండని ముఖ్యమంత్రి వారితో అన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు అక్కడే బైఠాయించారు.
పరిస్థితిని అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. కేంద్రంతో మాట్లాడి గ్యాస్, బొగ్గు వచ్చేలా చూస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. తాను ఎంతగా చెప్పిన వినకపోవడంతో ఇంతకు మించి తానేమీ చెప్పలేనంటూ ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం శాసనసభ్యుల తీరుపై మంత్రి కొండ్రు మురళి మండిపడ్డారు. విద్యుత్ సమస్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం హాస్యాస్పదమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications