కొడ్నానీ 28 ఏళ్లు, బజ్రంగి జీవితమంతా జైలులోనే
ఈ కేసులో దోషులుగా తేలినవారిలో 28 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో ఏడుగురికి 21 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అల్లర్లకు సంబంధించి 31 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష ప్రధాన శిక్షకు ముందు అనుభవించాల్సి ఉంటుంది. నరేష్ చారా, మోర్లి సింధి, హరేష్ రాథోడ్, సురేష్ లంగాడో, ప్రేమ్చంద్ తివారీ, మనోజ్భాయ్ సింధి కుక్రాణి, బిపిన్ పంచల్లకు 21 ఏళ్ల జైలు శిక్ష పడింది.
నరోడా పాటియా కేసులో ప్రత్యేక కోర్టు మాజీ మంత్రి మాయా కొడ్నానీ, భజరంగ్ దళ్ మాజీ నేత బాబు భజరంగిని దోషులుగా తేల్చింది. గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన అతి పెద్ద ఊచకోత కేసు ఇది. ఈ కేసులో మొత్తం 32 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో తీర్పు జూన్ 30వ తేదీన వెలువడాల్సి ఉంది. అయితే అది ఆగస్టు 29వ తేదీకి వాయిదా పడింది.
కొడ్నానీ గుజరాత్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. నరోడాలోలోని పారిశ్రామిక ప్రాంతంలో 2002 ఫిబ్రవరి 28వ తేదీన 97 మందిని ఊచకోత కోశారు. అందులో 94 మంది శవాలు దొరికాయి. మరో ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తేలలేదు. మొత్తం 94 మందిలో 84 మందిని గుర్తించారు.
నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో 47 మందిని పట్టుకుని చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్కు) అప్పగించింది. ఆ తర్వాత మరో 24 మందిని అరెస్టు చేశారు. వారిలో మాయా కొడ్నానీ కూడా ఉన్నారు. ఈ కేసులో మొత్తం 8 చార్జిషీట్లు దాఖలు చేశారు.
విచారణ 2009లో ప్రారభమై రెండేళ్ల పాటు కొనసాగింది. తేజాస్ పాఠక్, మోహన్ నేపాలీ బెయిల్ను జంప్ చేశారు. విచారణ జరుగతున్న కాలంలో 8 మంది నిందితులు మరణించారు. వారిలో ఒకరికి కేసు నుంచి విముక్తి లభించింది. వినోద్ మరాఠే ఇప్పటికీ పరారీలో ఉన్నారు.