ఇద్దరు వేరని..: కెవిపి డైరీ ఆవిష్కరణపై అంబటి కామెంట్
వైయస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణపేరిట ఢిల్లీలో కాంగ్రెసు నేతలు చేసిన హడావుడి ప్రజలను మభ్యపెట్టేందుకేనన్నారు. వైయస్ పేరును జగన్ ఆస్తుల కేసులలో సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చి, క్రిమినల్గా చిత్రీకరించినప్పుడు ఆ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చిన వైయస్ కుటుంబాన్ని కాంగ్రెసు పెద్దలు వేధిస్తున్నారని ఆరోపించారు.
ప్రజాధరణ కలిగిన వైయస్ తనయుడు జగన్ను జైలుకు పంపినప్పుడు ఈ నేతలు ఏమయ్యారన్నారు. వైయస్ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్న ఈ నేతలకు వైయస్ను తమవాడని చెప్పుకునే నైతిక హక్కు లేదన్నారు. త్వరలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు విలీనమవుతాయన్న వదంతులపై అంబటి స్పందిస్తూ ప్రజలు ఇలాంటి వాటిని నమ్మరన్నారు. ఇవన్నీ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించిన తమ పార్టీని, జగన్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేందుకే అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇంకా అధికారదాహం తీరలేదని, పాదయాత్రలు, సైకిల్ షోలు వంటి జిమ్మిక్కులతో ఆయనకు అధికారం దక్కడం కల్ల అన్నారు. పాదయాత్ర చేసిన అందరూ ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోలేరని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిన బాబు, ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతున్నారని అన్నారు.