మన్మోహన్ను టార్గెట్ చేసిన మోడీ, అద్వానీ రథం పైన
మెహసానా జిల్లాలోని బేచారజీ పట్టణం నుంచి స్వామి వివేకానంద యువ వికాస్ యాత్రతో నెలరోజుల ప్రచారానికి ఆయన మంగళవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్ శాసనసభకు వచ్చే డిసెంబర్నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. బిజెపి మాజీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, పార్టీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ సమక్షంలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, బిజెపి సునాయాసంగా తిరిగి అధికారంలోకి రాగలదని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ రాజ్యాంగ సంస్థలపై కూడా దాడులకు పాల్పడుతోందని మోడీ తీవ్రంగా విమర్శించారు. బొగ్గు కుంభకోణాన్ని వెలికి తీసిన ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)పై విమర్శలకు దిగిన కాంగ్రెస్ గతంలో 2జీ స్పెక్ట్రమ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుకే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందన్నారు. రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
గుజరాత్కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎన్నికల ప్రచారం సాగించగలమని మోడీ సూచన ప్రాయంగా చెప్పారు. కేన్సర్ వ్యాధిని తుడిచిపెట్టడానికి గుట్కాకు చోటులేని గుజరాత్ కోసం కృషి చేసినట్టుగానే, కాంగ్రెస్ రహిత గుజరాత్ కోసం పని చేయాలని ఆయన అన్నారు. ఇప్పటికే తాను ఎన్నో రకాల దర్యాప్తులను ఎదుర్కొన్నానని, ఇపుడు బొగ్గు కేటాయింపుపై ప్రధాని కూడా సిట్ దర్యాప్తును ఎదుర్కొంటే బాగుంటుందని పేర్కొన్నారు.
దర్యాప్తులను ఎదుర్కొనడంలో మన్మోహన్, కాంగ్రెస్ పార్టీలు తనతో పోటీకి దిగితే, ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని సవాల్ చేశారు. తమకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిన కాగ్ విశ్వసనీయతను ప్రశ్నించడానికి కూడా ప్రధాని, ఆయన సహచరులు వెనుకాడటంలేదని మోడీ అన్నారు. తనకు మద్దతివ్వనివారికి ప్రతికూలమైన వాతావరణం కల్పించడం ఇందిరాగాంధీ పద్ధతి అని, ఇపుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆయన అన్నారు.
తమ తాజా యాత్రను వ్యతిరేకించాలంటూ కాంగ్రెస్ పిలుపు ఇవ్వడాన్ని కూడా ఆయన ఆక్షేపిస్తూ, ప్రజలకు అభిప్రాయాలను తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెప్పారు. అభివృద్ధి కోసం గుజరాత్ నమూనాను అనుసరించాలని ప్రధానికి సూచించారు. తాము మళ్లీ సునాయాసంగా అధికారంలోకి వస్తామని, పదేళ్లు కష్టపడి పనిచేసిన తమ ప్రభుత్వ రికార్డే తామేమిటో ప్రజలకు తెలియజేస్తుందని మోడీ అన్నారు.