మళ్లీ ఉద్యమించమంటారా: వాయలార్ రవితో కెసిఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఈ నెల 5న ఢిల్లీ వచ్చిన కేసీఆర్ ఈనెల 10న కాంగ్రెస్ ముఖ్యులతో ముఖాముఖి చర్చలు ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన సంకేతాలున్నాయని కొన్నాళ్లుగా చెబుతూ వచ్చిన ఆయన 10న రవితో మంతనాలు జరిపారు. శుక్రవారం తనయుడితో కలిసి మరోసారి వయలార్ను కలిశారు.
ఈ రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ మీడియాకు దూరంగా ఉన్నారు. 10న జరిగిన భేటీకి కొనసాగింపుగా జరిగిన శుక్రవారంనాటి చర్చల్లో కేసీఆర్ మరోసారి తెలంగాణ విషయమై తన వైఖరిని పునరుద్ఘాటించారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. వయలార్తో సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని కెటి రామారావు మీడియా ప్రతినిధులకు చెప్పారు.
తెలంగాణపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెరాస మరోసారి ఉద్యమం బాట పట్టకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అనుకూల నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టంగా చెప్పామన్నారు. 30న జరగనున్న తెలంగాణ మార్చ్ కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకొనే అధికారం తనకు లేనందున కేసీఆర్కు ఎటువంటి హామీ ఇవ్వలేనని రవి స్పష్టం చేశారని తెలిసింది.
కేసీఆర్ అభిప్రాయాలను సోనియా దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్తో రాజకీయ సంబంధాలను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని రవి మీడియా వద్ద కొట్టిపారేశారు. చాలా దూరంలోఉన్న విషయాన్ని ఇప్పుడే ఎందుకు ప్రస్తావిస్తారని ఆయన ప్రశ్నించారు.