రేషన్ లబ్ధిదారులకు, విద్యార్థులకు ఇకపై ఆ ఆహార ధాన్యాలు కూడా!
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు తెలంగాణా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఆరు కిలోల సన్న బియ్యంతో పాటు, ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలు, ముఖ్యంగా జొన్నలను పంపిణీ చేయాలని తెలంగాణా సర్కార్ నిర్ణయించింది. రేషన్ లభ్దిదారులకు ఇప్పటికే సన్న బియ్యం ఇస్తున్న సర్కార్ త్వరలో జొన్నలు, మొక్కజొన్నలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
రేషన్ లబ్దిదారులకు జొన్నలు, మొక్కజొన్నలు
ఈ మేరకు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రేషన్ లబ్దిదారులకు జొన్నలు, మొక్కజొన్నలు ఇవ్వటం వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించి, పేదలకు బలవర్ధకమైన ఆహారం అందించడానికే అని పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మార్క్ఫెడ్ సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

విద్యార్థులకు పౌష్టికాహారం
అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల భోజనంలో కూడా జొన్నలను చేర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా పోషకాహార లోపంతో బాధపడకూడదని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.
మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్లో జొన్నలు, మొక్కజొన్నల ధరలు మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోళ్లకు సిద్ధమైందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి సహకారం అందకపోయినా, రాష్ట్ర సొంత నిధులతోనే యాసంగి పంటను సేకరించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రస్తుతం 278 కేంద్రాల ద్వారా మొక్కజొన్న సేకరణ కొనసాగుతుండగా, జొన్నలను కూడా అదే పద్ధతిలో సేకరించనున్నారు.
పౌర సరఫరాల శాఖ ద్వారా మొక్కజొన్న, జొన్నల పంపిణీ
యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.68 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి, పీడీఎస్ ద్వారా పంపిణీ చేయనుంది. ఈ విధానం వల్ల రైతులకు ఆర్థిక భద్రత, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. పంపిణీ విధివిధానాలను త్వరలోనే ఖరారు చేసి, అమల్లోకి తీసుకురానున్నారు.













Click it and Unblock the Notifications