కోదండరాం వ్యాఖ్యలు: తెరాస వద్ద శ్రీధర్ బాబు ఆవేదన
తెలంగాణ కోరుకుంటున్నారు.. గుండా మల్లేష్
తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి మార్పును కోరుకోవటం లేదని సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అన్నారు. తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వమని కేంద్రం చెప్పకనే చెబుతోందని ఆయన విమర్శించారు.
మొక్కుబడిగా సభ... జూలకంటి
ప్రభుత్వం సభను కేవలం మొక్కుబడిగా మాత్రమే నడుపుతోందని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపైన సభలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు.
వసూళ్ల కోసమే ఢిల్లీకి.. మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వసూళ్ల కోసమే ఢిల్లీకి వెళ్లారని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్కు చీము, నెత్తురు ఉంటే తెలంగాణ వచ్చే వరకు హైదరాబాదులో అడుగు పెట్టవద్దన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సభలో విద్యుత్ సమస్య, ఫీజు రీయింబర్సుమెంట్సు పైన చర్చించాలన్నారు.
విద్యుత్ కోతలతో రాష్ట్రంలోని పలు పరిశ్రమలు మూత పడ్డాయని, కార్మికులు రోడ్డున పడ్డారని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రభుత్వం విద్యుత్ సమస్యపై చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమైన తర్వాత మరోసారి అరగంట పాటు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే టిడిపి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు విద్యుత్, తెలంగాణ సమస్యలపై చర్చించాలని పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు.