తెలంగాణ: కదిలిన సోనియా, కెసిఆర్తో వారు చర్చలు

సీనియర్ నేతలతో సభ్యులతో సోనియా గాంధీ సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, ఆంటోనీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై గంటకు పైగా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణపై సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను సోనియా వద్ద వెల్లడించినట్లు సమాచారం. వాయలార్ రవి చైనా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 22వ తేదీన కెసిఆర్తో చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణపై ఈ నెల 21వ తేదీన యుపిఎ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీలోగానే తెలంగాణ అంశాన్ని తేల్చేయడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.
కెసిఆర్ ఈ నెల 5వ తేదీ నుంచి ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెసు పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి వాయలార్ రవితో ఆయన చర్చలు జరిపారు. సోనియా గాంధీతో సమావేశానికి కూడా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకు వస్తే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి తాను సిద్ధమేనని ఆయన చెబుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఇవ్వకపోతే జరిగే నష్టం గురించి ఆయన కాంగ్రెసు పెద్దలకు వివరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే, హైదరాబాదులోని పార్లమెంటు సభ్యుడు జి వివేక్ నివాసంలో తెలంగాణ ప్రాంత ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
డీజిల్ ధరల పెంపుపై, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై పరిమితిపై ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పెంచిన ధరలను తగ్గించేది లేదని ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన డోకా లేదని ఆయన అన్నారు. తమ మిత్రుల మద్దతు, బయటి నుంచి వస్తున్న మద్దతు కొనసాగుతుందని ఆయన అన్నారు. రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications