రూ.20 కోసం 30 ఏళ్ల న్యాయపోరాటం.. చివరికి సుప్రీంకోర్టులో బిగ్ ట్విస్ట్!
కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై ఉన్న నేరారోపణలను కొట్టివేస్తూ.. వారిని పూర్తి నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేనప్పుడు కేవలం రికవరీని ప్రాతిపదికగా తీసుకుని శిక్ష విధించడం చట్టరీత్యా చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
1996 నాటి ఘటన
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 1996లో గుజరాత్లోని ఆనంద్ జిల్లా, బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఓ విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్కమ్ సర్టిఫికేట్) కోసం వెళ్లాడు. సర్టిఫికేట్ ఇచ్చేందుకు క్లర్క్ రూ.120 లంచం డిమాండ్ చేశాడని(అందులో క్లర్క్కు రూ.100, అటెండర్కు రూ.20) ఆరోపిస్తూ సదరు విద్యార్థి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. అధికారులు రంగంలోకి దిగి గుర్తులు ఉన్న రూ.120 నోట్లను ఇచ్చి ఏసీబీ ట్రాఫ్ నిర్వహించారు.

విచారణలో తేలిన విషయాలు
ఏసీబీ సోదాల సమయంలో విద్యార్థి వద్ద ఉన్న రూ.20 నోటును అటెండర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్క్ వద్ద నుంచి ఎలాంటి సొమ్ము లభించలేదు. విచారణ క్రమంలో సదరు విద్యార్థి ఇచ్చిన వాంగ్మూలంలో తీవ్ర వైరుధ్యాలు వెలుగు చూశాయి. క్లర్క్ పక్కనే ఉన్నప్పటికీ మొత్తం రూ.120 ఇవ్వకుండా కేవలం రూ.20 మాత్రమే ఎందుకు ఇచ్చాడనే దానికి స్పష్టత లేదు. అంతేకాకుండా అటెండర్ తనను నేరుగా ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదని విద్యార్థి క్రాస్ ఎగ్జామినేషన్లో అంగీకరించాడు. మరుసటి రోజు ఈద్ పండుగ ఉన్నందున విద్యార్థి సంతోషంతో ఇచ్చి ఉండవచ్చన్న అటెండర్ వివరణను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
దిగువ కోర్టుల తీర్పులు రద్దు
జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 20 ప్రకారం.. ప్రాథమికంగా లంచం డిమాండ్ చేసినట్లు రుజువు కానప్పుడు కేవలం డబ్బు దొరికినంత మాత్రాన నేరం రుజువు కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. క్లర్క్ పై విచారణకు ఇచ్చిన అనుమతి కూడా సాంకేతికంగా చెల్లదని పేర్కొంది. గతంలో ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇద్దరు ఉద్యోగులను నిర్దోషులుగా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications