పూలు, పండ్ల రేట్లు స్కైరాకెట్: ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క
వరలక్ష్మి వ్రతం వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. పెరిగిన డిమాండ్ కారణంగా పూలు, పండ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాలు, పూజా ద్రవ్యాల ధరలు భారీగా పెరిగినప్పటికీ, సాంప్రదాయ పండుగ కావడంతో భక్తులు కొనుగోళ్లకు ఏమాత్రం వెనకాడటం లేదు.
పండుగ నేపథ్యంలో కనకాంబరం ధర కిలో ఏకంగా 3,000 రూపాయల దరకు పెరిగింది. పండుగ రోజు నాటికి 4,500 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తోన్నారు. మల్లెపూలు కిలో 500 నుండి 800 రూపాయల వరకు పలుకుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించే తామర పూల ధర కూడా అసాధారణంగా పెరిగింది. సాధారణ రోజుల్లో 15 నుండి 25 రూపాయలు పలికే తామర కాడ.. పండుగ రోజుల్లో 50 నుండి 100 రూపాయల వరకు అమ్ముడవుతోంది.

గన్నేరు వంటి సాధారణ పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇదివరకు కిలో 100 రూపాయలు ఉన్న గన్నేరు పూలు ప్రస్తుతం 500 రూపాయలకు చేరాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల పూల దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైందని చెబుతున్నారు.
ఈ ధరల పెరుగుదల పూలకే పరిమితం కావట్లేదు. పండ్ల రేట్లు కూడా కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఆపిల్, దానిమ్మ, అరటి, బత్తాయి ధరలు కిలోపై 100 రూపాయల వరకు పెరిగాయి. కిందటి వారం వరకూ కిలో 200 రూపాయలు ఉన్న ఆపిల్ ధర ఇప్పుడు 300 రూపాయలకు చేరింది. దేశీ ఆపిల్ ధర కిలో 200 రూపాయలను దాటేసింది. దానిమ్మ పండ్లను కిలో 150 నుండి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అరటి కిలో 80 నుండి 120 రూపాయల మధ్య ఉంటోంది.
హోల్సేల్ మార్కెట్ల నుండి పండ్లను కొనుగోలు చేసే రిటైల్ వ్యాపారులు స్థానిక మార్కెట్లలో సుమారు 10 నుండి 15 రూపాయల అదనపు ధరతో విక్రయిస్తున్నారు. పండగ కావడంతో ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ పూజా సామాగ్రిని తప్పనిసరిగా కొనాల్సి వస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. పూలు, పండ్ల కోసం తాము 1,000 నుంచి 1,500 రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.
హిందూ సాంప్రదాయంలో వరమహాలక్ష్మి పూజకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందుకే గృహాలు, పూజా గదులను అందంగా అలంకరించడానికి ధరల భారాన్ని సైతం లెక్కచేయకుండా పూలను కొనుగోలు చేస్తోన్నారు. పండగ డిమాండ్ను ఆసరాగా చేసుకుని ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్లపై వీటి ప్రభావం పడుతున్నప్పటికీ.. కొనుగోలుదారుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదు. మార్కెట్లన్నీ పండుగ కళను సంతరించుకున్నాయి.















Click it and Unblock the Notifications