జగన్ ఆస్తుల కేసు: సభలో టిడిపి దాడి, మంత్రుల భేటీ
సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులు, సభలో తమపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై వారు చర్చించారు. ఇతర మంత్రులపై ఛార్జీషీట్ దాఖలు చేసినట్లుగానే తమపై కూడా ఛార్జీషీట్ దాఖలు చేస్తే ఏం చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కోర్టు నోటీసులపై న్యాయవాదులతో కూడా మంత్రులు సంప్రదింపులు చేపట్టారు. ఈ కేసును వాదించనున్న న్యాయవాదితో వారు సుమారు నలభై నిమిషాలపాటు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలు కూడా జగన్ ఆస్తుల కేసులో నోటీసులు సుప్రీంకోర్టు నుండి అందుకున్నారు. మోపిదేవి ఇప్పటికే అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేశారు. దానిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం సుప్రీంకోర్టు నుండి నోటీసులు అందుకున్న మంత్రులను టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం సభ ప్రారంభం కాగానే.. కళంకిత మంత్రులను వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని టిడిపి నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత అశోక గజపతి రాజు మాట్లాడుతూ.. కళంకిత మంత్రులను ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎలా స్పందించాలనే విషయంతో పాటు సుప్రీం నోటీసులపై చర్చించేందుకు మంత్రులు భేటీ అయ్యారు.