సిఎంగా మంచిరెడ్డి, చంద్రబాబు పాత్రలో మోత్కుపల్లి
స్పీకర్ సభను ఎలాంటి చర్చలు జరపకుండా వాయిదాల మీద వాయిదాలు వేయడంపట్ల టిడిపి నిరసన వ్యక్తం చేస్తూ దీనిని చేపట్టింది. స్పీకర్ సీట్లో పయ్యావుల కేశవ్ కూర్చున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు అందరూ అధికార, ప్రతిపక్ష సభ్యులుగా విడిపోయారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత పాత్రలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు కరెంట్ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మోత్కుపల్లి మాట్లాడుతున్నంత సేపు స్పీకర్ సీట్లో కూర్చున్న పయ్యావుల అతనిని కూర్చోమంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. టిడిపి మాక్ అసెంబ్లీ అందరినీ ఆకట్టుకుంది. కాగా మంగళవారం ఉదయం సభ ప్రారంభం అయిన కాసేపటికే అరగంట వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. అయితే తెరాస సభ్యులు తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభ్యులు ఎంతకూ పట్టు వీడక పోవడంతో నాదెండ్ల మనోహర్ సభను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా సభ ఉండదు.