యుపిఎకు మమతా గుడ్బై: 21న మంత్రుల రాజీనామా

బొగ్గు కుంభకోణంనుంచి దేశం దృష్టిని మరల్చడానికే కేంద్రం ఎఫ్డిఐలను రంగంమీదికి తీసుకువచ్చిందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం పదే పదే ధరలు పెంచుతున్నందున తమకు గత్యంతరం లేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె చెప్పారు. కేంద్రంలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, డీజిల్ ధరల పెంపు విషయంలో గాని, గ్యాస్ సిలిండర్ల తగ్గింపు విషయంలో గాని, రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విషయంలో గాని కేంద్ర ప్రభుత్వం తమతో సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది.
అయితే కాంగ్రెస్ వర్గాలు ఈ వాదనతో ఏకీభవించడంలేదు. దేశ ఆర్థిక పరిస్థితి గురించీ, ఇంధనం పరిస్థితి గురించీ ముందునుంచీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు చెబుతూనే ఉన్నామని వారు అంటున్నారు. మూడు రోజుల క్రితం కూడా ప్రధాని ప్రభుత్వ వైఖరిని వివరించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెప్పారు. అయితే తర్వాత మాట్లాడతానని మమత అంతటితో ఆ సంభాషణను ముగించినట్టు తెలుస్తున్నది.
అయితే ప్రస్తుత పరిస్థితులలో తృణమూల్కు చెందిన 19 మంది టిఎంసి పార్లమెంటు సభ్యులు యుపిఎ నుంచి బయటకు వచ్చినా అటు సమాజ్ వాది పార్టీ 22 మంది పార్లమెంటు సభ్యులతోనూ, మాయావతి తమ 21 మంది బిఎస్పీ పార్లమెంటు సభ్యులతోనూ యుపిఎ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత యుపిఎ ప్రభుత్వం నిలబడాలంటే 272 మంది సభ్యుల మద్దతు అవసరం. తృణమూల్ వెళ్లిపోయినా ఎస్పీ, బిఎస్పీ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications