బాబ్లీ పూర్తయింది, ఏంచేద్దాం, తాగునీటికే..: ఎపికి సుప్రీం
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అక్రమమని, ఎస్సారెస్సీ ప్రాజెక్టు స్థలంలోనే బాబ్లీని నిర్మించడం చట్ట వ్యతిరేకమని మన న్యాయవాది పరాశరణ్ వాదించారు. బాబ్లీ గేట్లు తెరిస్తే ఎస్సారెస్సీ నుండి 65 టిఎంసిల నీళ్లు మహారాష్ట్రకు వెళ్తాయని అన్నారు. సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించి మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణం చేపట్టిందన్నారు. ఎపి వాదనలు విన్న కోర్టు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి బాబ్లీని ఎలా నిర్మించారని మహారాష్ట్రను ప్రశ్నించింది.
సిడబ్ల్యుసి ఆదేశాల మేరకే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని, కోర్టు ఉత్తర్వులను ఎక్కడా ఉల్లంఘించలేదని, చిన్న ప్రాజెక్టు పైన ఎపికి అభ్యంతరాలెందుకని, సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని మహా న్యాయవాది అర్జున్ వాదించారు. ఇరు వైపుల వాదనలు వింటూనే కోర్టు బాబ్లీ ప్రాజెక్టు పూర్తయింది కదా ఇప్పుడేం చేద్దామని ఎపిని ప్రశ్నించింది. మంచి నీటి కోసం ప్రాజెక్టు నిర్మిస్తే తప్పేమిటంది.
ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి నీటిని వినియోగించుకోవడంలో తప్పు లేదు కదా అని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటే మీకు సరిపోతుంది కదా అని ఎపిని ప్రశ్నించింది. వాదనలు పూర్తయిన అనంతరం సుప్రీం కోర్టు బాబ్లీపై విచారణనను అక్టోబర్ మూడవ తేదికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా.. ఇరు రాష్ట్రాలు 3న తమ వాదనలు పూర్తి చేయాలని సూచించింది.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున తాగు నీటి కోసమే వాడుకోవాలని మహారాష్ట్రను ఆదేశిస్తే మీకేమైనా అభ్యంతరమా అని ఎపిని ప్రశ్నించింది. కాగా ఇరు రాష్ట్రాల వాదనలు వినేందుకు తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్ కోర్టుకు హాజరయ్యారు.