తర్వాతే తెలంగాణపై నిర్ణయం: వాయలార్, విలీనం పైనా..
ఈ సందర్భంగా తెరాస విలీనంపై అడగ్గా... కెసిఆర్ ఇటీవల రెండు మూడు సార్లు తనను కలిశారని, ఈ సందర్భంగా ఆయన విలీన ప్రస్తావనేమీ తేలేదని చెప్పారు. టిఆర్ఎస్ కాంగ్రెస్లోకి విలీనం అవుతున్నట్టు ప్రచారం ఎందుకు జరుగుతుందో తనకు తెలియదన్నారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో లేనని, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నా కానీ తెలంగాణ అంశాన్ని చెప్పలేనని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
తెలంగాణ ప్రాంతం వారు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారని, సీమాంధ్రులు సమైక్యాంధ్ర ఉండాలంటున్నారని, ఇరు ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అఖిలపక్షంలో పార్టీల వైఖరి తెలుసుకోవాలని, ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. తమ పార్టీలో కూడా కొందరు తెలంగాణ కోరుతుండగా, మరికొందరు వద్దంటున్నారని వాయలార్ రవి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలిన పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. విలీనం అంటే అంత ఈజీ కాదని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ఇటీవల వినిపిస్తున్న విషయం తెలిసిందే.