తలుచుకుంటే అడుగు పెట్టనివ్వం: సిఎంపై పొన్నం ఫైర్

కాంగ్రెసు నేతలుగా తాము ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని, సీమాంధ్ర పార్టీ నేతల గురించి పెద్దగా ఆలోచించలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సీటులో కూర్చునే అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా అని ఆయన అడిగారు. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గడం ప్రజాస్వామ్యమా, తెలంగాణకు వ్యతిరేకత ఉందని ఎలా ముఖ్యమంత్రి చెప్తారని ఆయన అడిగారు.
ముఖ్యమంత్రిని తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు విశ్వసించడం లేదని, తెలంగాణ మంత్రులను అగౌరవపరచడానికే డిజిపితో ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడించారని ఆయన విమర్శించారు. బాధ్యత గల వ్యక్తిగా సిఎం మాట్లాడుతున్నారా అని అడిగారు. విగ్రహాలు కూలిస్తే బాధపడుతారు గానీ తమ ప్రాణాలు పోతే బాధపడరా అని ఆయన ప్రశ్నించారు. ఏ రోజైనా ముఖ్యమంత్రి మంత్రులను పిలిచి పార్టీ గురించి మాట్లాడారా అని అడిగారు. రెచ్చగొట్టడానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆయన అన్నారు. హైకమాండ్ సీమాంధ్ర మాటలు వినడం బాధాకరమని ఆయన అన్నారు.
తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణపై తెలంగాణలోనే వ్యతిరేకత ఉందని ఎలా చెప్పుతున్నారని ఆయన అడిగారు. తెలంగాణపై మాట్లాడేందుకు తెలంగాణకు చెందిన మంత్రులు కె జానారెడ్డి, సారయ్య మాజీ పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు ఇంటికి వచ్చారు. అక్కడే ఉన్న పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చి మీడియా ప్రతినిధుల వద్ద ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అసలు ఏమనుకుంటున్నారని, వ్యతిరేకత ఉందని చెప్పడానికి కొలమానం ఏమిటని, వ్యతిరేకత ఉందని ఎలా చెప్తారని ఆయన ప్రశ్నించారు. వ్యతిరేకత అంటే ఏమిటో చెప్పాలని అడిగారు.
మిగతా పార్లమెంటు సభ్యులు కూడా ముఖ్యమంత్రి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు తప్ప హింసకు తావు లేదని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హింస జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై కేశవరావు కూడా తీవ్రంగా మండిపడ్డారు 52 చోట్ల ఎన్నికలు జరిగితే 50 చోట్ల కాంగ్రెసు ఓడిపోయిందని, కాంగ్రెసు 18 ఎన్నికల్లో ఓడిపోయిందని, తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని, ఇదంతా వ్యతిరేకతనేనా అని ఆయన అన్నారు.
తెలంగాణ మార్చ్ జరిగి తీరుతుందని కేశవరావు అన్నారు. మార్చ్ ఎక్కడనేది తెలంగాణ జెఎసి నిర్ణయిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి తీరుపై పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ కూడా మండిపడ్డారు. రాష్ట్రంలో బ్రిటిష్ పాలన సాగుతున్నట్లు ఉందని మరో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications