వరంగల్ లో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్.. మంత్రి ప్రకటన!
ప్రస్తుతం మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి క్యాన్సర్. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీస్ అయిన క్యాన్సర్ వ్యాధి కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నియంత్రణ, నివారణపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తోంది. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 50 వేల నుండి 55 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి.
క్యాన్సర్ వైద్యసేవల మెరుగుదలకు ప్లాన్ చేసిన తెలంగాణా సర్కార్
ప్రతి క్యాన్సర్ బాధితుల వెనక వారి కుటుంబం ఉంటుంది. ఊహించని విధంగా క్యాన్సర్ ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. అటువంటి క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స చేయడం సులభమవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రివెంటివ్ క్యాన్సర్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను విస్తరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం భారీగా నమోదు తున్న క్యాన్సర్ కేసులను దృష్టిలో పెట్టుకొని వైద్య సేవల మెరుగుదలకు కృషి చేస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ రిజిస్ట్రీ
తెలంగాణ ప్రభుత్వం బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, చైల్డ్ హుడ్ క్యాన్సర్ తదితర క్యాన్సర్ ల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నోటిఫయబుల్ డిసీజ్ గా ప్రకటించింది . క్యాన్సర్ కేసుల నమోదుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ రిజిస్ట్రీ ని మెయింటైన్ చేయడానికి క్యాన్సర్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్ లను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా మరో శుభవార్త చెప్పింది.
వరంగల్ లో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్
రాష్ట్రంలో ఎంఎన్జే తర్వాత, రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ను వరంగల్లో ఏర్పాటు చేయనుంది. ఇక ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలను అందించే విధంగా వరంగల్ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.
వరంగల్ రీజినల్ క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధిపై మంత్రి ప్రకటన
వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కీలక ప్రకటన చేశారు. ప్రతి రోగికి జిల్లా పరిధిలోనే క్యాన్సర్ చికిత్స అందించడానికి కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో త్వరలోనే వరంగల్ జిల్లాలో వరంగల్ రీజినల్ క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.
ఓరుగల్లుతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి ఉపశమనం
ఇప్పటికే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో క్యాన్సర్ సేవలను అందిస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్ వైద్య సేవలను మరింత విస్తరించడం పైన ఫోకస్ పెట్టిన క్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కీలక ప్రకటన చేశారు. ఇది ఓరుగల్లులోని ప్రజలకు మాత్రమే కాక చుట్టుప్రక్కల జిల్లాల వారికి కూడా ఒక పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు.













Click it and Unblock the Notifications