తెలంగాణ: ఇక ముందు కెసిఆర్తో ఆజాద్ చర్చలు
ఇప్పుడు గులాం నబీ ఆజాద్ రెండుమూడు రోజుల్లో కెసిఆర్తో సమావేశమై తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. కెసిఆర్తో వాయలార్ ఇంతవరకు జరిపిన చర్చల ప్రక్రియను ఆజాద్ మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని తెలిసింది. జాతీయ సమస్యలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు కెసిఆర్కు చెప్పినట్లు సమాచారం. ఆస్కార్ ఫెర్నాండెజ్ కెసిఆర్కు అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఉదయం గులాం నబీ ఆజాద్ను కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణా జెఏసి తలపెట్టిన మార్చ్ మూలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది. బొత్సతో మాట్లాడుతున్న సమయంలో ఆజాద్ ముఖ్యమంత్రికి టెలిఫోన్ చేసి తెలంగాణ కవాతుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేయాలని సూచించారు. వాయలార్ రవి కూడా ముఖ్యమంత్రికి టెలిఫోన్ చేసి తెలంగాణ కవాతుకు అనుమతించే విషయంలో ఆచితూచి అడుగువేయాలని హితవు చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి శుక్రవారం వాయలార్ రవి, ఏకె ఆంటోనీని కలిసి తెలంగాణ వివాదం గురించి వివరించారు. వీలైనంత త్వరగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న బొత్స సత్యనారాయణ తెలంగాణపై తన అభిప్రాయాన్ని వినిపించినట్లు సమాచారం. తెలంగాణకు అనుకూలంగానే బొత్స తన అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తోంది.