తెలంగాణ మార్చ్:'ప్లాన్ ప్రకారమే సాక్షివాహనంపై దాడి'
ఆదివారం సాయంత్రం కొందరు ఆందోళనకారులు పథకం ప్రకారమే మీడియా వాహనాలపై దాడులు చేసి తగుల బెట్టారు. తాము కవాతును కవర్ చేయడానికి వచ్చామని తమ వాహనాన్ని ధ్వంసం చేయవద్దని వేడుకున్న సాక్షి టివి డిఎస్ఎన్జి వ్యాన్ డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్ పైన వారు దౌర్జన్యానికి దిగి గాయపర్చారు. తెలంగాణ కవాతును ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సాక్షి టివి డిఎస్ఎన్జి వాహనంతో సిబ్బంది బయలుదేరి వెళ్లింది. మీడియాకు కేటాయించిన స్థలంలో పార్క్ చేశారు.
కాసేపటికి వంద మంది మూకుమ్మడిగా వచ్చి అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై దాడి చేశారు. టైర్లలో గాలి తీశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ ట్యాంక్ తెరిచి నిప్పు పెట్టారు. మధ్యాహ్నం నుండే వేలాది తెలంగాణవాదులు నెక్లెస్ రోడ్డులోనే ఉన్నప్పటికీ ఎవరూ మీడియా వాహనాలను కన్నెత్తి చూడలేదు. కానీ సాయంత్రం అకస్మాత్తుగా తెరాస ఎమ్మెల్యే ఒకరు తన అనుచరులతో కలిసి కవాతు జరుగుతున్న ప్రాంతానికి ర్యాలీగా వచ్చారు.
వచ్చిన వెంటనే వారు సభాస్థలి వైపు వెళ్లకుండా మీడియా వాహనాల వైపుకు వచ్చారు. ముందుగా దూరదర్శన్తో పాటు మరో ప్రయివేటు మీడియా డిఎస్ఎన్జి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ పక్కనే ఉన్న సాక్షి వాహనాన్ని ధ్వంసం చేశారు. దాదాపు వందమంది ఒకేసారి దాడికి దిగటంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆ తర్వాత ఆందోళనకారులు వాహనానికి నిప్పు పెట్టారు. వీడియో ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించనున్నారు.
కాగా కవాతు ప్రాంతంలో సీమాంధ్ర మీడియా అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, టివి9, ఎన్టీవి తదితర పత్రికలు, టీవి ఛానళ్లకు వ్యతిరేకంగా కటౌట్లు వెలిసిన విషయం తెలిసిందే. వీటిని కూడా కొందరు ఉద్దేశ్య పూర్వకంగానే పెట్టారని చెబుతున్నారు. మీడియాకు వ్యతిరేక అంశాలను తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ అప్పుడే ఖండించిన విషయం తెలిసిందే.