జగన్ వచ్చాక అనుకొని: విజయమ్మ, షర్మిల యాత్రపై..
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రణబ్ రాష్ట్రపతి అయ్యాక గౌరవపూర్వకంగా అభినందనలు తెలిపేందుకు కలుద్దామని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నామని, జగన్ బెయిల్ పైన వస్తే అందరం కలుద్దామనుకున్నామని, కానీ సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోవడంతో తామే కలిసినట్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచినందుకు ప్రణబ్కు తాము అభినందనలు తెలియజేశామని చెప్పారు.
జగన్కు జరిగిన అన్యాయాన్ని తాము ఆయన దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. సిబిఐ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, దాని తీరు పైన ఫిర్యాదు చేశామని చెప్పారు. తమకు న్యాయం జరిగేలా చూడమని కోరామని, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించామని తెలిపారు. తన తనయ షర్మిల పాదయాత్ర పైన ఎల్లుండి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ చెప్పారు.
సిబిఐ కక్షపూరిత వైఖరిని రాష్ట్రపతికి వివరించినట్లు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. జగన్కు బెయిల్ రాకుండా సిబిఐ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు తెలిపిన విషయాలనే రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. బెయిల్ విచారణకు ముందు రోజు కాంగ్రెసు పెద్దలను టిడిపి నేతలు కలిశారన్నారు. టిడిపి నేతల భేటీ తర్వాతే ఈడి ఆస్తుల జఫ్తు వ్యవహారం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయని రాష్ట్రపతికి తెలిపినట్లు చెప్పారు.