ఏ యాత్ర చేసినా మాకు సరిపోదు: షర్మిళపై పయ్యావుల
ప్రణబ్ ముఖర్జీతో జరిపిన సంభాషణల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన వైయస్ విజయమ్మను డిమాండ్ చేశారు. సిబిఐ, ఈడి కాకుండా ఏ సంస్థతో వైయస్ జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేయించాలో విజయమ్మ చెప్పాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఈడి, సిబిఐ వంటి సంస్థలపై నమ్మకం లేకపోతే ఇక ఏ వ్యవస్థపై నమ్మకం ఉంటుందని ఆయన అడిగారు.
వారే దర్యాప్తు చేసుకుని వారే క్లీన్చిట్ ఇచ్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థలపై నమ్మకం పోయే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు కోర్టులను కూడా తప్పు పట్టే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఓటేసినందుకు తమకు ఓ విధమైన బహుమతి ఇస్తారని అడిగేందుకు విజయమ్మ ప్రణబ్ ముఖర్జీని కలిశారా అని ఆయన అడిగారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాకు సంకేతాలు పంపడానికి కలిశారా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి భద్రతపై పలు విధాల వార్తలు వస్తున్నాయని అంటూ చంద్రబాబుకు ఎవరి నుంచి ముప్పు ఉందో ప్రభుత్వం చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్రకు కౌంటర్గా షర్మిళ పాదయాత్ర గానీ ఓదార్పు యాత్ర గానీ చేపట్టవచ్చునని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల 10వ తేదీన నిర్ణయం తీసుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు కూడా చెప్పారు.