పేదలకు శుభవార్త.. మే నెలాఖరుకు వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు!
తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మే నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇళ్ళ నిర్మాణ పనులపై మంత్రి ఆదేశం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ లబ్ధిదారులకు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ముగింపు దశలో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్ పైన మంత్రులు తుమ్మల, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు
ఈ సమీక్షలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తి చేసిన ఖర్చులు మినహాయించి మిగతా డబ్బులు ఇస్తామని, కాంట్రాక్టర్లు ఇల్లు పూర్తి చేయకపోతే లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. వీరికి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించాలన్న మంత్రి పొంగులేటి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఎవరైనా అనర్హులు ఉంటే వారిని తప్పించి అర్హులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అలాగే ఇల్లు కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని, 400 కోట్ల రూపాయలతో కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు బిల్లుల విషయంలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
అక్రమాలకు పాల్పడితే డిస్మిస్ చేస్తామని హెచ్చరిక
ఎవరైనా అక్రమాలకు పాల్పడితే డిస్మిస్ చేసేందుకు కూడా వెనకాడబోమని మంత్రి హెచ్చరించారు. అర్హులకు ఇల్లు ఇవ్వటం ముఖ్యమని, లబ్ధిదారుడు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు అనేది ముఖ్యం కాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొదటి విడతలో దరఖాస్తు చేసుకుని వివిధ కారణాలతో నిర్మాణం చేపట్టని వారి బదులు కొత్తవారికి అవకాశం మంత్రి కల్పించాలన్నారు మంత్రి పొంగులేటి.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదు
ప్రతి ఇందిరమ్మ ఇంటికి 40 టన్నులు ఇసుక ఉచితంగా అందిస్తున్నామని, ఇసుక దుర్వినియోగం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. చాలామంది లబ్ధిదారులు నగరాలకు దూరంగా కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉండడం లేదని అలాంటి వారిని గుర్తించి వారికి సమీపంలో ఇల్లును కేటాయించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టర్లు ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపైన చర్యలు తీసుకోవాలని, భూ ఆక్రమణలను కట్టడి చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications