షర్మిల పాదయాత్ర 2,500 కాదు 3వేల కిలోమీటర్లు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా షర్మిలతో పాదయాత్ర చేయించాలనే నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రనా, రథయాత్రనా లేక ఓదార్పు యాత్రనా అనే అంశంపై పార్టీలో తర్జన భర్జన ప్రారంభమైంది. మెజార్టీ సభ్యులు పాదయాత్రకే మొగ్గుచూపారు.
పార్టీ నేతలు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యాత్ర ఏవిధంగా ఉండాలో గురువారం నిర్ణయిస్తామని చెప్పారు. అలా చెప్పినప్పటికీ పాదయాత్రనే ఖరారైనట్లుగా సమాచారం. ఈ పాదయాత్రకు అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనతో చర్చించాకే షర్మిలతో యాత్ర చేయించేందుకు పార్టీ సిద్ధమైంది.
అలాగే ఈ పాదయాత్రను ఈ నెల 17 నుండి ప్రారంభించాలని తొలుత భావించినప్పటికీ 18 నుండి ప్రారంభించాలని తాజాగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర సాగనుంది. కడప, కర్నూలు, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా షర్మిల పాదయాత్ర సాగనుంది. అయితే అన్ని విషయాలను వైయస్సార్ కాంగ్రెసు మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించనుంది.