ఇప్పట్లో కాదు, ఎప్పుడో చెప్పలేం: తెలంగాణపై ఆజాద్
తెలంగాణపై తాను ఆనేకసార్లు చెప్పానని అంటూనే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనే కాదు, అందరితోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీకి ఎవరు వచ్చినా మాట్లాడుతామని ఆయన అన్నారు. మంత్రులు, శానససభ్యులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
తెలంగాణపై రెండేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నామని ఆజాద్ చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయం అవసరమని, ఏకాభిప్రాయ సాధన వచ్చే వరకు తెలంగాణపై నిర్ణయం సాధ్యం కాదని, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఎంపి, బీహార్, యుపి విభజన మాదిరిగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులతో, ప్రజలతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు గానీ ఏకాభిప్రాయం రావడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై మాట్లాడుతుండగా ఆజాద్ పక్కన తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. వ్యాధులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. డెంగీ వ్యాధిపై ప్రభుత్వాధికారుతో సమీక్ష జరిపినట్లు ఆయన తెలిపారు.