జగన్కు మైసూరా దూరమయ్యారా: రివర్స్ అయిందా?
కాంగ్రెసు పార్టీలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో విభేదించిన మైసూరా ఆ తర్వాత టిడిపిలో చేరారు. జగన్ అరెస్టు సమయంలో ఆయన ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. అంతకుముందు నుండే ఆయన జగన్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు మరోసారి తనకు మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించక పోవడంతో ఆయన జగన్ వైపుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే విజయమ్మను కలవడంతో పార్టీయే మొదట అతనిపై వేటు వేసింది.
ఆయన అనుభవం, ఆ కుటుంబంతో ఉన్న సంబంధాల రీత్యా జగన్ పార్టీలో ఆయనదే హవా ఉంటుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ప్రారంభంలో ఆయన హవా కొనసాగింది. అయితే క్రమంగా ఆయన ప్రాతినిధ్యం పార్టీలో తగ్గిందని చెబుతున్నారు. జగన్ అరెస్టు కావడంతో పార్టీలో చక్రం తిప్పేది తానే అని మైసూరా భావించారట. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగిందని చెబుతున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
పార్టీ నిర్వహించే కార్యక్రమాలు కూడా ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో జగన్కు చుక్కెదురు అయినప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్లక ముందు ఆయన దానిని వ్యతిరేకించారని సమాచారం. అయితే వారు ఢిల్లీ వెళ్లి వచ్చే వరకు ఆయనకు తెలియదట. ఢిల్లీ వెళ్లొచ్చిన విషయం మీడియా చెబితేనే తెలిసిందట. జగన్ బెయిల్ పిటిషన్ అంశంపై మైసూరా ఓసారి నోరు కూడా జారారట. దాని ప్రభావమే ఆయనపై పడిందని చెబుతున్నారు.
తాను పార్టీలో చేరాక అంతా తానే నడిపించవచ్చునని భావించిన మైసూరా రెడ్డికి ఇప్పుడు ఆ పార్టీలో కరువు ఏర్పడిందని అంటున్నారు. ఆయనను పట్టించుకునే వారే లేరట. సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు మైసూరా రెడ్డి ఏం చేస్తారో చూడాలని అంటున్నారు. మైసూరా తీరుపై పార్టీలో అసంతృప్తి వ్యక్తం కావడం, దీంతో అతను పార్టీకి దూరం కావడం ఆయన వర్గం జీర్ణించుకోలేక పోతుందని చెబుతున్నారు.