ఈ శిక్ష ఎందుకు బాబు, సిఎం రేసులో లేను: రఘువీరా
హిందూపురం నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించడంతో.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన విషయం గుర్తుకొచ్చి బాబు తనను తాను శిక్షించుకుంటున్నారా చెప్పాలన్నారు. ఈ శిక్ష ఎందుకో చెప్పనంత కాలం బాబును ప్రజలు విశ్వసించరని అన్నారు. ఇప్పుడు గుప్పిస్తున్న హామీలను ఆనాడు ఎందుకు అమలు చేయలేకపోయారని ఎవరైనా ప్రశ్నిస్తే బాబు ఏమని సమాధానం చెబుతారని నిలదీశారు.
పార్టీ నుండి వెళ్లిపోతున్న కార్యకర్తలను కాపాడుకునేందుకే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల తన పాదయాత్ర ప్రారంభించాక స్పందిస్తానని చెప్పారు. వారిద్దరు ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు విశ్వసించరన్నారు. ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని రఘువీరా రెడ్డి అన్నారు. రాష్ట్ర నాయకత్వం విషయంలో అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రతి పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రానికి టాయ్లెట్లు నిర్మించి నిర్మలాంధ్రప్రదేశ్ను ఆవిష్కరించే దిశగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దూసుకుపోతోందని ఇరవై సూత్రాల అమలు సంఘం చైర్మన్ తులసి రెడ్డి అన్నారు.