తండ్రికి తగ్గ తనయురాలు: షర్మిలపై వైఎస్ సోదరి
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ముందు జరిగిన బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద తల్లి వైయస్ విజయమ్మ, వదిన వైయస్ భారతిలతో కలిసి ఆమె తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, అభిమానులు కూడా పాల్గొన్నారు
ఆ తర్వాత వైయస్ ఘాట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర విజయవంతం సాగాలని వేద పండితులు ఆశీర్వదించి, షర్మిలకు కంకణధారణ చేశారు. వైయస్ సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ప్రజలను కష్టాల పాలు చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే షర్మిల పాదయాత్ర చేపట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే తమ బాధ్యత అని వారు గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైయస్ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని మరో ప్రజా ప్రస్థానం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సుభాష్ చంద్రబోస్, భూమా నాగిరెడ్డి అన్నారు.