పవర్ స్టార్కు తెలంగాణ సెగ: ప్రస్తావనే లేదన్న పూరీ

హైదరాబాదులోని ఆరాధన థియేటర్లోని సినిమా రీళ్లను ఉస్మానియా విశ్వవిద్యాలం విద్యార్థులు దగ్ధం చేశారు. సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, మేడ్చెల్ల్లో సినిమా ప్రదర్శనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. సికింద్రాబాదులోని కుషాయిగుడాలో గల శివశక్తి, శారద తదితర థియేటర్లలో సినిమా ఫ్లెక్సీలను, కటౌట్లను, బ్యానర్లను ఆందోళనకారులు తగులబెట్టారు. మహబూబ్నగర్ వెంకటేశ్వర టాకీసులో కూడా అదే సీను రిపీట్ అయింది.
ఖమ్మం జిల్లాలోని వెంకటేశ్వర థియేటర్లో సినిమా పోస్టర్లను దగ్ధం చేశారు. కరీనంగర్ జిల్లా వేములవాడలో సినిమా ఆడుతున్న థియేటర్లకు తాళాలు వేశారు. హన్మకొండలోని అమృత థియేటర్ ముందు ఆందోళనకారులు ధర్నా చేశారు. పోస్టర్లను, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. తెలంగాణకు చెందిన సినిమా దర్శకుడు ఎన్. శంకర్, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ఆర్ నారాయణ మూర్తి శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు. సినిమాపై కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసి నాయకులు, తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూరీ జగన్నాథ్ కార్యాలయంపై దాడి చేశారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉందంటూ గురువారంనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్నూలు జిల్లాలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. హటాత్తుగా తెలంగాణవాదులు సినిమాపై తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇదిలా వుంటే, సినిమాపై పూరి జగన్నాథ్, నైజాం పంపిణీదారుడు దిల్ రాజు వివరణ ఇచ్చారు.
చంద్రబాబును విమర్శంచలేదు, తెలంగాణ ప్రస్తావన లేదు
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తాను విమర్శంచలేదని, సినిమాలో తెలంగాణ ప్రస్తావనే లేదని దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఎవరికి వారు ఊహించుకుని సినిమాపై విమర్శలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎవరినీ నొప్పించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఉద్దేశ్యవూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని అన్నారు. జనాన్ని ఎలా రెచ్చగొట్టారో చూపించామని చెప్పారు.
చిత్రం విడుదలకు ముందు చాలా మంది చూశారని, ఎవరు అభ్యంతరపెట్టలేదని ఆయన అన్నారు. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని కొందరు అన్నారు కాబట్టి 12 కట్స్ ఇచ్చామని చెప్పారు. తన సినిమాలో ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని, జాతీయ భావనతో సినిమా చేశానని పూరి జగన్నాథ్ అన్నారు. ఇంత వివాదం అవుతుందని తాను అనుకోలేదని అన్నారు. ఒక పార్టీకి ఫేవర్గా తాను సినిమా తీయలేదని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తుంటే, ఈ విధమైన ప్రశ్నలు వేసి రెచ్చగొట్టవద్దంటూ ఆయన లేచి వెళ్లిపోయారు.
వివాదం గురించి తెలిసిన వెంటనే తాను దర్శకుడు, నిర్మాతలతో మాట్లాడానని దిల్ రాజు చెప్పారు. రైపు తెలంగాణ నాయకులకు సినిమా చూపిస్తామని, ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిశీలిస్తామని ఆయన అన్నారు. సినిమా వినోదం కోసమేనని, ఎవరి మనోభావాలను కూడా దెబ్బ తీయకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications