పవన్ కళ్యాణ్ సినిమా: అన్న చిరంజీవి కూడా టార్గెట్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్, దిల్ రాజులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిపై తిట్ల దండకంతో నిప్పులు చెరిగారు. తెలంగాణవాదుల ధాటికి తట్టుకోలేక దర్శకుడు పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దిగొచ్చారు. ఓ ప్రాంత ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉంటే వాటిని తొలగిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంత నేతలకు ఆ సినిమా చూపించి అభ్యంతర సన్నివేశాలను తొలగించేందుకు సిద్ధమన్నారు. పూరీ కార్యాలయంపై దాడి జరిగింది.
అయితే ఈ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం వివాదం పవన్ కళ్యాణ్ సోదరుడు, కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కూడా తాకింది. పలువురు తెలంగాణవాదులు ఈ చిత్రంపై నిప్పులు కక్కుతూనే చిరంజీవిపై కూడా మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని, అయినా దానిని లెక్క చేయకుండా అతను నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా తెలంగాణ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు.
ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యావాదానికి మద్దతు పలికారని మండిపడ్డారు. సీమాంధ్రలోని ప్రజలు సమైక్యవాదం అననప్పటికీ చిరంజీవి తెలంగాణవాదుల మనోభావాల్ని గౌరవించలేదన్నారు. రాజకీయాల్లో చిరంజీవి, సినిమాల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణవాదాన్ని, ఉద్యమాన్ని కించపర్చే విధంగా వ్యవహరించారని ఆరోపించారు.