బెయిల్ అనుకుంటే దూకుడు: జగన్ క్యాంప్లో కలకలం?

విజయ సాయి రెడ్డిని ఈడి ఢిల్లీకి విచారణ నిమిత్తం పిలవడంతో ఇప్పుడు జగన్ వర్గంలో ఆందోళన ప్రారంభమైందని అంటున్నారు. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్నా వైయస్ జగన్ను కూడా ఢిల్లీకి తీసుకు వెళ్లి విచారించే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వారిని వేధిస్తోందట. ఇటీవల సుప్రీం కోర్టులో బెయిల్ రాకపోవడం, బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు కూడా మరో నాలుగైదు నెలలు ఉండటం ఇప్పటికే ఆ పార్టీలో తీవ్ర నిరుత్సాహాన్ని నింపింది.
పార్టీ నేతల్లో, కార్యకర్తల్లోని నిరుత్సాహాన్ని గుర్తించడం వల్లనే షర్మిల కొత్త ఉత్సాహం కోసం పాదయాత్ర తలపెట్టారు. ఇప్పుడు ఈడి దూకుడుతో ఆ పార్టీలో మరింత ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవలే రూ.52 కోట్ల ఆస్తులను జగన్ ఆస్తుల కేసులో జప్తు చేశారు. సిబిఐ మార్చి నెలాఖరు వరకు కేసును ముగించని పక్షంలో జగన్కు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి నుండే ఈడి దూకుడుగా వ్యవహరిస్తే.. తీరా బెయిల్ పిటిషన్ కోరే సమయానికి జగన్ మరింత ఈడి ఉచ్చులో కూడా ఇరుక్కునే అవకాశాలు కొట్టి పారేయలేం. ఈ అంశం ఇప్పుడు జగన్ వర్గంలో ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈడి మాత్రమే కాకుండా సిబిఐ కూడా సుప్రీం కోర్టు గడువు విధించడంతో కేసు విచారణలో వేగాన్ని పెంచింది. ఇది కూడా జగన్ వర్గానికి మింగుడు పడకుండా చేస్తోందని అంటున్నారు.
ఇప్పటికే జగన్ను చంచల్గూడ జైలు నుండి తీహార్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. విచారణకు అనుకూలంగా ఉండేందుకు జగన్ను ఢిల్లీకి తరలిస్తారనే వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications