క్యాబినెట్లోకి రాహుల్ నో: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే..
ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. శుక్రవారమే విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్ కూడా పదవులు వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పార్టీ కోసం పూర్తిస్థాయిలో పని చేస్తామని వారు సోనియాకు తెలిపారు.
నైస్ స్కామ్పై లోకాయుక్త ఎస్ఎం కృష్ణపై విచారణకు ఆదేశించిన మర్నాడే ఆయన రాజీనామా చేశారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించేందుకే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించినట్లు చెబుతున్నారు. కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించవచ్చునని చెబుతున్నారు.
కాంగ్రెసు అధిష్టానం పార్టీలో పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రివర్గంలో యువతకు, కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చి, పార్టీ వ్యవహారాలను సీనియర్లకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్తోపాటు మరికొందరి రాజీనామాలను సోనియా కోరనున్నట్లు చెబుతున్నారు. గురువారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో రెండున్నర గంటలు చర్చించిన సోనియా శుక్రవారం సాయంత్రం కూడా గంట సేపు ఆయనతో భేటీ అయ్యారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఆదివారం ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని వారు నిర్ణయించారు. మంత్రివర్గ జాబితా కూడా ఖరారైనట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్కు పెద్ద పీట
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్లకు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖరారైనట్లే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు అందింది. శనివారం ఆమె పేరు కూడా ఓకే కావచ్చునని తెలుస్తోంది. కావూరి సాంబశివరావు లేదా రేణుకా చౌదరిలో ఎవరో ఒకరికి అవకాశం ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో, ఇద్దరినీ పక్కన పెట్టవచ్చని చెబుతున్నారు.
రెండు నెలల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ నుంచి వైదొలగడంతో ఒకేసారి ఆరు మంత్రిపదవులు ఖాళీ అయ్యాయి. 2జీ కుంభకోణం నేపథ్యంలో డీఎంకేకు చెందిన ఎ.రాజా, దయానిధి మారన్ ఎప్పుడో రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. ఇప్పుడు ఈ ఖాళీలన్నీ భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు ఏహెచ్ ఖాన్ చౌదరి, ప్రదీప్ భట్టాచార్య, దీపామున్షీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
యువ మంత్రులు సచిన్ పైలట్, మిలింద్ దేవ్రా, జ్యోతిరాదిత్య సింధియాలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. రాహుల్కు సన్నిహితులుగా పేరున్న మానిక్కా ఠాగూర్, మీనాక్షి నటరాజన్లకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావిస్తున్నారు. రెండేసి శాఖలను మోస్తున్న కపిల్ సిబల్ (టెలికం, మానవ వనరుల అభివృద్ధి), సీపీ జోషి (రవాణా, రైల్వేలు), సల్మాన్ ఖుర్షీద్ (న్యాయ, మైనారిటీ వ్య వహారాలు), వీరప్ప మొయిలీ (కార్పొరేట్ వ్యవహారాలు, వి ద్యుత్తు), వయలార్ రవి (ప్రసార భారతీయ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ) బాధ్యతలను తగ్గించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.