రాహుల్ గాంధీని ప్రజలు కోరుకుంటున్నారు: కాంగ్రెస్
కాంగ్రెసు పేద ప్రజలు, రైతుల కోసమే కృషి చేస్తోందని, ప్రతిపక్షాలు తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ప్రతిపక్షాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ మంచి సమాధానమిచ్చారన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఘాటు సమాధానమిచ్చారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2004 నుండి తాము తీసుకున్న నిర్ణయాలు పేదల ప్రజలకు అనుకూలంగా ఉన్నాయని, రాహుల్ గాంధీ యువతకు పెద్ద పీట వేయాలని, వ్యవస్థను మార్చాలని పిలుపునిచ్చారన్నారు.
రాహుల్ పిలుపు మేరకు తాము ముందుకు వెళ్తామన్నారు. రాహుల్ ఓ మంచి సందేశం ఇచ్చారని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశాభివృద్ధికి ఏం తీసుకోవాలన్నా ఆ నిర్ణయాలన్ని కేవలం కాంగ్రెసు పార్టీయే తీసుకోగలుగుతుందని రాహుల్ గాంధీ ఢిల్లీ గడ్డపై గట్టిగా చెప్పారన్నారు. లోక్ పాల్ తీసుకు రావాలన్నా, ఆహార బిల్లు తీసుకు రావాలన్నా కేవలం తమ వల్లే సాధ్యమన్నారు.
రాహుల్, సోనియా, మన్మోహన్ల ప్రసంగం పార్టీలో ఉత్సాహం నింపేందుకు ఉపయోగపడిందని పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు. 2014లో సాధారణ ఎన్నికలకు ముందు ఇలాంటి బహిరంగ సభా చాలా అవసరమని ఎంపీ మంద జగన్నాథం అన్నారు. రాహుల్ గాంధీ భావి ప్రధాని అని, ఆయన కార్యకర్తలకు మంచి సందేశాలు ఇచ్చారన్నారు.
కాగా ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెసు ప్రజా సదస్సుని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్తో పాటు కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.