షర్మిల యాత్ర: నిమ్మాడ వరకు సా...గనున్న బాబు!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదిన ప్రారంభమైన చంద్రబాబు వస్తున్నా మీకోసం.. రూపొందించుకున్న షెడ్యూలు ప్రకారం 117 రోజులు సాగుతుంది. అంటే జనవరి 26న ముగియాలి. కానీ పలు కారణాల వల్ల చంద్రబాబు తన పాదయాత్రను గణతంత్ర దినోత్సవం తర్వాత కూడా కొనసాగించనున్నారు.

ఇటీవల చంద్రబాబు పాదయాత్రకు పలు అడ్డంగులు ఎదురైన విషయం తెలిసిందే. గద్వాలలో వేదిక కూలడం వల్ల ఒక్కరోజు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడి మృతి వల్ల రెండు రోజులు, నీలం తుఫాను కారణంగా ఓ రోజు బాబు పాదయాత్రకు బ్రేక్ పడింది. ముందు ముందు ఇంకేమైనా కారణాలతో మరికొద్ది రోజులు పాదయాత్ర వాయిదా పడవచ్చు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు తన యాత్రను పొడిగించే నిర్ణయం తీసుకున్నారట.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రెడ్డి కూడా మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. బాబు, షర్మిలల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు పాదయాత్ర ముందుగానే పూర్తయి.. షర్మిలది అలాగే కొనసాగితే టిడిపికి నష్టం జరుగుతుందని పలువురు నాయకులు బాబుకు సూచించారట.
రెండో విడత చేయడం కంటే బ్రేకుల పేరుతో మరికొద్ది రోజులు పొడిగిస్తేనే మంచిదనే భావనతో తెలుగు తమ్ముళ్లు ఉండటంతో బాబు కూడా సరేనన్నారట. దీంతో చంద్రబాబు తన యాత్రను గణతంత్ర దినోత్సవం తర్వాత కూడా చేయనున్నారు. మొదటి విడత ముగిసిన తర్వాత అవసరమైన పక్షంలో రెండో విడతగా చేసేందుకు కూడా బాబు సిద్ధంగా ఉన్నారట. చంద్రబాబు తన పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ కొనసాగించాలని నిర్ణయించుకున్నారట. నిమ్మాడ ఇటీవల మృతి చెందిన ఎర్రన్నాయుడి స్వగ్రామం.












Click it and Unblock the Notifications