టిడిపితో కలిసి జగన్ తెలంగాణను అడ్డుకున్నారు: హరీష్
తెలంగాణకు అనుకూలమని జైల్లో ఉన్న జగన్తో చెప్పించాలని ఆయన కొండా సురేఖను డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ ప్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని, తెలంగాణపై జగన్ చేసిన దండయాత్రను ప్రజలు మరిచిపోలేదని ఆయన అన్నారు. తెలంగాణకు జగన్ అనుకూలమని చెప్పే వరకు కెసిఆర్ను గానీ తమ పార్టీని గానీ విమర్శించే నైతిక హక్కు కొండా సురేఖకు లేదని ఆయన అన్నారు. నేరం చేసి, కోట్లు దోచిన సీమాంధ్ర నేత వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తానని కొండా సురేఖ అంటున్నారని, తెలంగాణ రాష్ట్రానికి దళితను ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ అంటున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ఎలా తెస్తామనే విషయాన్ని కెసిఆర్ 2001లోనే చెప్పారని ఆయన అన్నారు. రాజకీయ శక్తిగా మారడం ద్వారా తెలంగాణను సాధిస్తామని కెసిఆర్ 2001 ఏప్రిల్లో జలదృశ్యంలో చెప్పారని, ఇప్పుడు కరీంనగర్లో కూడా అదే చెప్పారని ఆయన గుర్తు చేశారు. 17 మంది శానససభ్యులుంటేనే ఒక్క రోజు కూడా శానససభ నడవలేదు, వంద మంది శాసనసభ్యులు ఉంటే ఎలా నడుస్తుందని ఆయన అడిగారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వస్తున్నా.. మీకోసం బదులు వస్తున్నా కుర్చీ కోసమని చంద్రబాబు పాదయాత్రకు పేరు పెట్టుకుంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతారని ఆయన అన్నారు. చంద్రబాబు కమ్యూనిస్టులతో, బిజెపితో పొత్తులు పెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు చంద్రబాబు తీవ్ర నిస్పృహలో ఉన్నారని, ప్రజా స్పందన లేఖ పోవడంతో ఆ నిస్పృహ చంద్రబాబు ముఖంలో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దమ్ముంటే చంద్రబాబు తెలంగాణపై బహిరంగ చర్చకు రావాలని ఆయన అన్నారు.
కల్లు డిపోలు ఎత్తేయించిన చంద్రబాబు ఇప్పుడు తాటి చెట్లు ఎక్కుతున్నాడని, విద్యుత్ ఆందోళన సందర్భంగా ఆందోళనకారులను కాల్చి చంపించిన చంద్రబాబు 9 గంటలు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తానని హామీ ఇస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబే ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి నడిపించారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నడవడం మొదలుపెడితే శాసనసభ్యులు ఇతర పార్టీలకు వలసలు పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై మాట మార్చింది, మోసం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు.
ఇటు తెలంగాణ ప్రజలూ అటు సీమాంధ్ర ప్రజలూ తెలుగుదేశం పార్టీని విశ్వసించడం లేదని, తెలుగుదేశం పార్టీకి ఓ సిద్ధాంతం లేదని, తెలుగుదేశం నాయకులకు ఓ వైఖరి లేదని, వారికి బస్ స్టాండే గతి అవుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ ఉద్యమ కార్యాచరణతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు వణుకు పుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.