పార్టీ పదవి కోసం బాలయ్య వెయిటే చేయాల్సిందే
2013మే నెలలో పార్టీ మహానాడు జరుగుతుంది. అప్పటి బాలకృష్ణ వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పలువురు నేతలు పార్టీ వీడి వెళ్తున్న పరిస్థితుల్లో ఖాళీల భర్తీకి చంద్రబాబు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో నాయకులు కొంత మంది మరణించారు. కొందరు పార్టీ వదిలిపెట్టారు. ఎన్నికల సమయంలో ఎవరు పార్టీ వీడి వెళ్తారో, ఎవరు ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొనడంతో ఖాళీల భర్తీకి బాబు ఆసక్తి చూపటం లేదని చెబుతున్నారు.
ఇంతకు ముందు మే నెలలో జరగాల్సిన మహానాడు ఉప ఎన్నికల కారణంగా జరగలేదు. నిజానికి, ఆర్నెల్ల క్రితమే మహానాడు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండింది. పాత కార్యవర్గం యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు. ఒక్క పొలిట్ బ్యూరోలోనే ఆరు ఖాళీలు ఏర్పడ్డాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పొలిట్ బ్యూరో సభ్యుల సంఖ్య మొత్తం ఇరవై. వీరిలో ఎర్రంనాయుడు మరణించగా, కొందరు పార్టీ మారారు. ఇంకొందరు దూరంగా ఉంటున్నారు.
పొలిట్ బ్యూరో సభ్యులు ఎంవి మైసూరారెడ్డి, ఉప్పులేటి కల్పన టిడిపికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. నాగం జనార్దన్రెడ్డి తెలంగాణ అంశంపై పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ నగరా సమితి ఏర్పాటు చేశారు. ఇక ఉపాధ్యక్షుల్లో సంకినేని వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్లో చేరగా, హరీశ్వర్రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. బివి మోహన్రెడ్డి, ముద్దసాని దామోదర్రెడ్డి మరణించారు. వేణుగోపాలాచారి పార్టీ వీడి వెళ్లారు. అల్లాడి రాజ్కుమార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
అధికార ప్రతినిధుల్లో రుమాండ్ల రామచంద్రయ్య పార్టీ వీడి తెరాసకు వెళ్లిపోయారు. బోడ జనార్దన్, చెంగల వెంకట్రావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ విజయరామారావు 2009 డిసెంబర్లో కేంద్రం తెలంగాణపై ప్రకటన చేశాక, టిడిపి యు టర్న్ తీసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసి విజయరామారావు పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ టివిఆర్ శాస్ర్తీ సైతం పార్టీకి దూరంగానే ఉంటున్నారు.
పొలిట్ బ్యూరో, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల్లోనే ఇన్ని ఖాళీలుంటే ఇక మిగిలిన కార్యవర్గంలో పెద్ద సంఖ్యలో నాయకులు టిడిపిని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నా వీటిని భర్తీ చేయడానికి మాత్రం ఇది సరైన సమయం కాదని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు. లోక్సభకు, అసెంబ్లీకి ముందుస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో ఉన్న పార్టీ నాయకత్వం పార్టీ ఖాళీల భర్తీపై దృష్టి సారించే ఉద్దేశంలో లేదు.