జగన్ జైలుకెళ్లకుంటే ఓదార్చే వారు: వైయస్ విజయమ్మ
జగన్ జైలుకు వెళ్లకుంటే అమరవీరుల కుటుంబాలను ఓదార్చే వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాటలను ఎవరు నమ్మడం లేదన్నారు. వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కంటే తాను తెలంగాణకు ఎక్కువ చేశానని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.
తన హయాంలో రుణమాఫీలు గుర్తుకు రాని చంద్రబాబు ఇప్పుడు హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగు వేల మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడు బాబు అని ధ్వజమెత్తారు. జగన్ త్వరలో బయటకు వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై జగన్ను జైలులో పెట్టాయన్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే దివంగత వైయస్ నాటి సువర్ణ పాలన మళ్లీ సాధ్యమన్నారు.
చంద్రబాబు పాలనలో ప్రజలు ముంబయి, దుబాయిలకు వలస పోయారన్నారు. వైయస్ జలయజ్ఞంలో తెలంగాణకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, కరెంటు కోసం నానా అవస్థలు పడ్డారని, ప్రతిపక్ష నేత వైయస్ 14 రోజుల పాటు దీక్ష చేశారన్నారు. కాగా సభ ప్రారంభానికి ముందు దివంగత వైయస్, అమర వీరుల కుటుంబాలకు నివాళులు అర్పించారు.