వైయస్ జగన్ ముప్పు: దూకుడు పెంచిన తెరాస
ఒక దశలో తెరాస వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని మాత్రమే లక్ష్యం చేసుకుంది. దీంతో జగన్ హైదరాబాద్ ఫీజు పోరును, ఆర్మూరులో రైతు దీక్షను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో తాము, సీమాంధ్రలో వైయస్ జగన్ స్వీప్ చేస్తామని భావిస్తూ వచ్చిన తెరాసకు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెద్ద ముప్పుగా పరిణమించింది.
ఒకానొక సందర్భంలో వైయస్ జగన్కు, తెరాస అధ్యక్షుడు కెసిఆర్కు మధ్య రహస్య అవగాహన ఉందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దాంతో సిరిసిల్లలో వైయస్ విజయమ్మ చేపట్టిన చేనేత దీక్షకు వ్యతిరేకంగా తెరాస కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత కొంత కాలం వరకు తెరాస వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోలేదు.
కానీ ఇటీవలి కాలంలో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్రు పెట్టి తెరాసను దెబ్బ తీయాలనే ఎత్తు వేసింది. దాంతో తెరాసకు వేడి తగిలింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు చేరిన కేకే మహేందర్రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, రవీంద్రనాయక్, జగదీశ్వర్రావు వంటి నేతలు గతంలో తెరాసలో పనిచేసినవారే. తమను కెసిఆర్ మోసం చేశారనే కోపంతో వారు తెలంగాణ నాయకులను వైయస్సార్ కాంగ్రెసులోకి లాక్కోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అడ్డుకట్ట వేయకపోతే తమకు కూడా ముప్పు తప్పదనే స్థితికి తెరాస వచ్చేసింది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఇటీవల విమర్శల జోరు పెంచింది. కెసిఆర్ తొలిసారి కరీంనగర్ మేధోమథన సదస్సులో జగన్పై, వైయస్సార్ కాంగ్రెసుపై విమర్శలు చేశారు.