IPL 2026: ములుపు తిప్పిన సుందరం.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పటిష్టమైన పంజాబ్ కింగ్స్ను ఓడించింది. వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్తో ఓడిపోయే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. గుజరాత్ టైటాన్స్కు వరుసగా మూడో విజయం కాగా.. పంజాబ్ కింగ్స్కు ఇది వరుసగా రెండో పరాజయం.
గెలిపించిన సుందరం..
164 పరుగుల లక్ష్య ఛేదనను గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ హీరో సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా(2), జాసన్ హోల్డర్(8) వెనుదిరిగినా చిన్న చిన్న భాగస్వామ్యాలతో గుజరాత్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఆఖరి ఓవర్లో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ దిశగా సుందర్ కొట్టిన సిక్సర్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్(2/30), అర్ష్దీప్ సింగ్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. మార్కోజాన్సెన్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు.

నిప్పులు చెరిగిన హోల్డర్..
అంతకుముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. సూర్యాన్ష్ షెద్గే(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), మార్కో జాన్సెన్(11 బంతుల్లో ఫోర్, సిక్స్తో 20) పర్వాలేదనిపించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్(4/24) నాలుగు వికెట్లతో పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబడా రెండేసి వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(19)తో పాటు నెహాల్ వధేరా(0), మార్కస్ స్టోయినీస్, గ్జేవియర్ బార్ట్లెట్(0)లను ఔట్ చేసిన జాసన్ హోల్డర్ పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. ఈ ప్రదర్శనతో వరుసగా రెండో మ్యాచ్లోనూ అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. పవర్ ప్లేలో సిరాజ్, రబాడ సత్తా చాటడంతో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఓవర్లలో హోల్డర్ కోలుకోలేని దెబ్బతీసాడు.
కొంపముంచిన స్టోయినీస్..
స్వల్ప లక్ష్యాన్ని కాపడుకునేందుకు పంజాబ్ సాయశక్తులా కృషి చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో గుజరాత్ బ్యాటర్లపై ఒత్తిడిని పెంచింది. కానీ ఆఖరి ఓవర్లో మార్కస్ స్టోయినీస్ 11 పరుగులు కట్టడి చేయలేక పంజాబ్ ఓటమికి కారణమయ్యాడు. కొత్త బ్యాటర్ అర్షద్ ఖాన్కు పరుగులివ్వకుండా కట్టడి చేయలేక మూల్యం చెల్లించుకున్నాడు.
తొలి బంతినే వైడ్ వేసి ఒక పరుగు అప్పనంగా ఇచ్చాడు. తర్వాతి బంతిని అర్షద్ ఖాన్ బౌండరీ బాది మూమెంటమ్ను గుజరాత్ వైపు తిప్పాడు. తర్వాతి మూడు బంతుల్లో 3 పరుగులే రావడంతో చివరి రెండు బంతులకు 3 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతిని ఎదుర్కొన్న వాషింగ్టన్ సుందర్ సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు.














Click it and Unblock the Notifications