షిర్డీ గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తుల కొత్త రికార్డు- ఏకంగా ఒకే సారి..!!
షిర్డీ ఆలయంలో గురు పూర్ణిమ వేళ కొత్త రికార్డు నమోదైంది. ప్రతీ ఏటా గురు పూర్ణిమ నాడు భక్తులు పెద్ద సంఖ్యలో షిర్డీకి వస్తారు. సాయిబాబాను దర్శించుకుంటారు. అదే సమయంలో గురు దక్షిణ సమర్పిస్తారు. దేశ..విదేశాల నుంచి భక్తులు ప్రతీ ఏటా సాయి బాబా దర్శనం కోసం తరలి రావటంతో షిర్డీ రద్దీగా మారుతోంది. అయితే, గత ఏడాది రికార్డులను తిరగరాస్తూ ఈ ఏడాది కొత్త రికార్డు నమోదు అయింది.
షిర్డీలో గురు పూర్ణిమ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా షిర్డీలో ఈ వేడుకలను వీక్షించేందుకు తరలి వస్తారు. ఈ ఏడాది మూడు రోజుల పాటు జరిగిన ఈ గురు పూర్ణిమ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు గురుదక్షిణగా విరాళాలు సమర్పించారు. గురు పౌర్ణమి ఉత్సవాల సమయంలో మూడు రోజుల్లోనే, సంస్థకు రూ.7,81,13,000 విరాళాలు అందినట్లు గుర్తించారు. గత ఏడాది కంటే ఈ సారి 1.5 కోట్ల రూపాయల పెరుగుదల నమోదైందని సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష గదిల్కర్ తెలిపారు. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు ఈ సారి గురు పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన లెక్కలను భక్తుల కోసం వెల్లడించారు.

పెరుగుతున్న భక్తుల సంఖ్య
ఈ మూడు రోజుల్లో భక్తులు విరాళాల కౌంటర్ వద్ద రూ.1,25,47,935, పీఆర్ఓ కార్యాలయం ద్వారా రూ.87,14000 విరాళంగా అందగా, డెబిట్- క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ విరాళాలు, చెక్కులు, డీడీలు, మనీ ఆర్డర్ల ద్వారా సంస్థకు మొత్తం రూ.2,7,84,701 అందాయి. దీంతో పాటుగా అదనంగా, విదేశీ కరెన్సీ ద్వారా రూ.5,65,991 విరాళం అందింది. దీనితో పాటు, భక్తులు నగదుతో పాటు పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు కూడా సమర్పించారని వివరించారు. ఈ కాలంలో రూ.1,46,74,544 విలువైన 1,125.570 గ్రాముల బంగారం లభించిందని, అలాగే రూ.3,90,649 విలువైన 2,376.500 గ్రాముల వెండి భక్తుల నుంచి ఆలయానికి అందిందని గోరక్ష్ గదిల్కర్ తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి పాదయాత్ర ద్వారా 39 పల్లకిల్లో వచ్చిన సాయి భక్తులకు సాయి ధర్మశాలలో వసతి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications