ఎమ్మెల్యేనే అన్న మంత్రి: షాడోలా మేమే..డిఎల్పై సెటైర్
వాన్పిక్ కేసులో ధర్మాన ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను మంత్రివర్గం అంగీకరించలేదు. ఇప్పుడు అది గవర్నర్ కోర్టుకు వెళ్లింది. ఈ సమయంలో ఆయన తాను ఎమ్మెల్యేని మాత్రమేనని చెప్పుకోవడం గమనార్హం. అదే సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలపై విచిత్రంగా స్పందించారు. కాంగ్రెసు పార్టీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా అంతర్గత కలహాలు, విమర్శల సంగతిని పలువురు ప్రశ్నిస్తుంటారని గుర్తు చేశారు.
తమ పార్టీలో ఒక మంత్రి ఏం చేస్తాడో మరో మంత్రి నిరంతరం కనిపెడతారని, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడో మరో ఎమ్మెల్యే గమనిస్తుంటాడని, ముఖ్యమంత్రి విషయం కూడా అంతేనని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. ఇలా సహచరులపై కన్నేసి ఉంచడం ద్వారా ప్రజలపై భారం తగ్గుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాటి వల్ల మాకు మేం నష్టపోతామే కానీ ప్రజలు ఏమాత్రం నష్టపోరని లాజిక్ లాగారు.
ముఖ్యమంత్రిపై సైతం కొంతమంది ఫిర్యాదులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని, మరే రాజకీయ పార్టీలోనూ ఇటువంటి వాటికి అవకాశం ఉండబోదని అన్నారు. అయితే ధర్మాన ఈ కామెంట్స్ ద్వారా మరో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలపై నేరుగా కాకుండా పరోక్షంగా స్పందించారు.
ఇతర పార్టీల్లో సొంత పార్టీ నేతలపై విమర్శించే స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించే వారు టిడిపిలో, జగన్ని విమర్శించే వారు వైయస్సార్ కాంగ్రెసులో, కెసిఆర్ను విమర్శించే వారు తెరాసలో ఉండగల్గుతారా అన్నారు. విమర్శల్ని స్వీకరించి తద్వారా ప్రజలకు మేలు చేసే గుణం, సహనం ఒక్క కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. విమర్శించే వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నామని, అది ప్రజల మంచికే అన్నారు.