బారులో టెక్కీ హత్య: ఒకరిని మరొకరిగా భావించి..

గ్యాంగ్ మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో తస్మాక్ బారులోకి ప్రవేశించి, బారును తమ ఆధీనంలోకి తీసుకుని, ఫర్నీచర్ను ఇష్టారాజ్యంగా ఎత్తి పారేశారు. బిల్లింగ్ కౌంటర్ వద్ద నిలబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్ కులకర్ణిపై దాడి చేశారు. కులకర్ణి మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దాంతో కులకర్ణి తీవ్రంగా గాయపడ్డాడు.
కులకర్ణి ఎకట్టుతంగళ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. అతని కుటుంబం షోలింగనల్లూర్లో నివసిస్తోంది. కులకర్ణి మరణించగానే గ్యాంగ్ పారిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసు జాయింట్ కమిషనర్ (దక్షిణ చెన్నై) తిరుగ్నానం, అడియార్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆర్ సుధాకర్, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఎవరో అనుకుని గ్యాంగ్ కులకర్ణిని చంపిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రతీకారంతోనే గ్యాంగ్ హత్యకు ఒడిగట్టిందని, అయితే కులకర్ణికి ఏ విధమైన నేరనేపథ్యం లేదని, అందువల్ల మరొకరిని చంపాలనుకుని గ్యాంగ్ కులకర్ణిని చంపి ఉంటుందని పోలీసులు అంటున్నారు.
బార్ లీజు విషయంలో వివాదం చోటు చేసుకుందని, ఇటీవల బార్ యాజమాన్యం మారిందని, దీంతో వివాదం తలెత్తిందని, హత్య వెనక కారణం అదే ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications