లక్షకోట్లు ఆర్జించినా..: జగన్పై కోదండ, షర్మిలకు సవాల్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకున్న వారే ఇప్పుడు ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కోరుకుంటున్న వారి శాతం ప్రస్తుతం ఈ ప్రాంతంలో 87 శాతం ఉందన్నారు. ఇంతమంది తెలంగాణ కోరుకుంటున్నప్పటికీ కాంగ్రెసు పార్టీని తేల్చక పోవడం శోచనీయం అన్నారు.
తెలంగాణపై కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతారని విరుచుకు పడ్డారు. గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి ఒక్కసారి ఒక్క తీరు మాట్లాడలేదని, వారివి అన్నీ దొంగ మాటలు అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీని నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. తెలంగాణను తేల్చాల్సిన స్థానంలో ఉన్న కాంగ్రెసు దీనిని విస్మరిస్తోందన్నారు. కమిటీలు, ప్యాకేజీలు అంటే జాప్యం చేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం 950 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నా కదలిక రాకపోవడం దారుణమన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికే షర్మిల, చంద్రబాబులు యాత్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణపై తమ వైఖరి తెలియజేయాలన్నారు. రాజకీయ నాయకత్వం నిబద్దతతో నిలబడితే తెలంగాణ ఏర్పాటు సాధ్యమే అన్నారు. ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్నారు.