తెలుగు మహాసభలు యధాతథం, వేదిక మార్పు
తిరుపతిలో వర్షాల కారణంగా ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న మహాసభల నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఈ సమీక్ష సమావేశానికి ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి 29 వరకు మహాసభలు జరుగుతాయి. తిరుపతిలో మహాసభలకు కేటాయించిన స్థలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ చిత్తడి నెలకొంది. దీంతోస మావేశాలను వాయిదా వేయాలని ముందు అనుకున్నప్పటికీ గురువారం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి తేదీలు వాయిదా వేయవద్దని, వేదిక మార్చి సభలు నిర్వహించాలని సూచించారు.
దాంతో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్, తారాకరామ గ్రౌండ్స్ను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అవిలాల చెరువులో పెద్దఎత్తున నీరు చేరింది. తెలుగు సభలకోసం సిద్ధం చేసిన 90 ఎకరాల స్థలంలో చాలాభాగం నీటితో నిండిపోగా, మిగిలిన ప్రాంతంవాహనాల రాకపోకలు సాగించడానికి వీలు లేనంత చిత్తడిగా మారింది.
దీంతో అనుకున్న సమయానికి (డిసెంబర్ 27నుంచి29 వరకు) ఇక్కడ సభలు నిర్వహించానికి వీలుకాదని సభాస్థలి ఏర్పాట్ల బాధ్యత చేపట్టిన టీటీడీ ఇంజనీరింగ్ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అవిలాల చెరువులో ఇప్పుడు వేదికలు నిర్మించడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడమే మంచిదని ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో వేదిక స్థలాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.