కడప నో: జగన్ ముందు షర్మిల బలం, పవర్ సెంటరా?
కడప ఇచ్చిన షాక్తో తేరుకున్న ఆమె ఇప్పుడు పార్టీలో తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ కడప దక్కడం లేదు. ఇక తన వర్గాన్ని తయారు చేసుకొని వారికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పించుకునే దిశలో ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారట. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉన్న ఆమె ఇటు పార్టీలో జవసత్వాలు నింపడంతో పాటు పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని కూడా తయారు చేసుకుంటోందట.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు తన వర్గానికి ఇప్పించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారట. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన విడుదలయి బయటకు వచ్చినా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యే అవకాశాలు లేవు. అయితే జగన్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, షర్మిల తన సోదరుడిపై అలక వహించలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభిమానుల నుండి వినిపిస్తున్న మాట.
జగన్ను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే ఇలాంటి ప్రచారం జరుగుతోందని అంటున్నారు. అయితే జగన్ బయటకు వచ్చాక షర్మిల ఇంటి పట్టునే ఉంటారనే ప్రచారం ఆమె పాదయాత్ర ప్రారంభించిన సమయంలో జరిగిందని, ఇప్పుడు మాత్రం ఒంగోలు లేదా విశాఖపట్నం నుండి పోటీ చేస్తారని చెబుతున్నారని, అలాగే కడపపై షర్మిల ఆశలు పెట్టుకుందన్న వార్తలు రాగానే వాటిని ఖండించకుండా అవినాష్ పేరును ప్రకటించారని, రాజకీయాలపై షర్మిలకు ఆసక్తి లేకుంటే, కడపను ఆమె కోరుకోకుంటే అప్పటికి ఇప్పటికి మార్పు రాకపోయి ఉండేదని, అలాగే కడపపై ప్రకటన కూడా జరగక పోయేది కదా అనే లాజిక్ లాగుతున్నారు.