త్వరగా తేల్చండి: సోనియాతో 40ని.లు టి-ఎంపీల భేటీ
సోనియాను కల్సిన తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినందుకు తాము సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. ఆమెతో ఏం మాట్లాడామో అది ఆంతరంగిక విషయమని చెప్పారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా దేని కోసం వేచి చూస్తున్నారో ఆ కల సాకారమయ్యే దిశలో తొలి అడుగు వేశామన్నారు.
తెలంగాణ సాధిస్తామనే నమ్మకముందన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతలు కలిసి తెలంగాణను అడ్డుకున్నారని, వారికి ధీటుగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయించడంలో తాము విజయం సాధించామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అఖిల పక్షం కోసం డిమాండ్ చేసి తెలంగాణలో అడుగు పెట్టారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏ నిర్ణయం చెప్పకుండా తెలంగాణలో దండయాత్ర చేస్తోందని, ఇప్పుడు వారి రంగు బయటపడుతుందన్నారు.
దొంగల పార్టీలకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రం ప్రస్తుతం రావణకాష్టంలా తయాలయిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేస్తున్నారని, వాటిని ఆపాలంటే సమస్య వెంటనే పరిష్కారం కావాల్సి ఉందన్నారు. సోనియా గాంధీ తమ విజ్ఞప్తిని సావధానంగా విన్నారని చెప్పారు. భేటీలో కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్లు పాల్గొన్నారు. దాదాపు నలభై నిమిషాలకు పైగా సోనియాతో ఎంపీలు భేటీ అయ్యారు.
ఇదే ఆఖరు సమావేశం కావాలి
తెలంగాణ అంశంపై ఇదే ఆఖరు అఖిల పక్ష సమావేశం కావాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ కోసం తానే మొదట సంతకం చేశానని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.