చెప్పకపోతే 27న బంద్: కోదండరామ్, జగ్గారెడ్డిపై ఫైర్
ఈ నెల 23వ తేదీన విద్రోహ దినం పాటిస్తామని, ఈ సందర్భంగా నల్లజెండాల ప్రదర్శన ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణపై అభిప్రాయం చెప్పని పార్టీల పట్ల అనుసరించాల్సిన కార్యాచరణను ఈ నెల 26, 27 తేదీల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మండల స్థాయిలో తెలంగాణ కోసం దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిపై కోదండరామ్ తీవ్రంగా మండిపడ్డారు. జగ్గారెడ్డి ఓ నీతిమాలిన వ్యక్తి అని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెసు అంటే జగ్గారెడ్డి ఒక్కడే కాడని ఆయన అన్నారు. జగ్గారెడ్డి నైతికంగా దిగజారారని ఆయన వ్యాఖ్యానించారు. జెఎసిని గ్రామస్థాయి వరకు విస్తరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల కార్యకర్తలను చేర్చుకోవద్దని అభిప్రాయపడింది.
ఇదిలావుంటే, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని శిల్పి రాజకుమార్ ఒడయార్ ఇంటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విభజన కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడిందన, మిగిలిన రాజకీయ పార్టీల్లో తెలంగాణ, సమైక్యవాదులున్నారని ఆయన చెప్పారు. ప్రత్యేక రాయలసీమ అంశాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ఉండగానే ప్రస్తావనకు తీసుకుని వచ్చినట్లు తెలిపారు.