అసంతృప్తి ఎఫెక్ట్: కావూరి సీటుపై నాగేశ్వర రావు కన్ను
కావూరి జగన్ వైపు వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారే విషయాన్ని కావూరి తోసిపుచ్చుతున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కావూరి మనవరాలి భర్త పోటీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. కావూరి ఇంతగా భీష్మించుకొని కూర్చోవడానికి మంత్రి పదవితో పాటు ఇది కూడా ఓ కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆయన జగన్ పార్టీలోకి వెళ్లక పోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మనవడిపై పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. దీంతో కావూరి వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుండి పోటీ చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కావూరి వచ్చేసారి పోటీ చేసే అవకాశాలు లేవని నియోజకవర్గం కాంగ్రెసు నేతలే పలువురు చెవులు కొరుక్కుంటున్నారట. ఇటీవల రాహుల్ గాంధీ టీం వచ్చినప్పుడు ఇదే విషయాన్ని స్థానిక కాంగ్రెసు నాయకులు కొందరు చెప్పారట.
మొదట కావూరి సాంబశివ రావుకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన నో చెప్పిన పక్షంలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశాన్ని రాహుల్ టీం నియోజకవర్గ నాయకులను ప్రశ్నించిందట. దీనికి ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారట. అందులో నాగేశ్వర రావు పేరు కూడా ఉందట. ఏలూరు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసేందుకు ఆయన ఉవ్వీళ్లూరుతున్నారట.