కారుపై స్వారీకి 25 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు?

తెరాసలోకి వచ్చే ఇతర పార్టీల లోకసభ సభ్యులకు, శాసనసభ్యులకు టికెట్ గ్యారంటీ ఇస్తే అక్కడి స్థానిక నాయకులు త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెరాస నాయకులు చెబుతున్నారు. దాదాపు ముగ్గురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెరాస వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అటు తెలుగుదేశం శాసనసభ్యులతోనూ, ఇటు కాంగ్రెసు ఎమ్మెల్యేలతోనూ చర్చలు జరుగుతున్నాయని తెరాస నాయకులు అంటున్నారు.
తెలంగాణ విషయంలో తమ పార్టీ తీరు పట్ల కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కలిసినప్పుడు కాంగ్రెసు తెలంగాణ ఎంపీలతో దాదాపుగా డీల్ కుదిరిందని తెరాస నాయకులు చెబుతున్నారు. మందా జగన్నాథం, వివేక్, రాజయ్యలతో పాటు పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ కూడా తెరాస వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. మరో ఇద్దరు కాంగ్రెసు ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, ఇతర పార్టీలకు చెందిన లోకసభ, శాసనసభా స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న తెరాస నాయకులు ఉన్నారు. ఉదాహరణకు వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు సీటు ఆశిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వస్తే ఆయనకు టికెట్ ఇవ్వడం కష్టమే అవుతుంది. దీంతో పార్టీలో ఉన్న నాయకులకు ప్రత్యామ్నాయం చూపిస్తూ కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు కెసిఆర్ నచ్చజెప్పుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications